ఇప్ప (లాటిన్ Madhuca longifolia) సపోటేసి కుటుంబానికి చెందిన అడవి చెట్టు. భారతదేశంలోని గిరిజనులు దీనిని పవిత్రంగా భావిస్తారు. గిరిజనులు జరుపుకునే సంప్రదాయ వేడుకలు, సంబరాలు, పెళ్ళిసమయంలో ఇప్పపూల నుండి తయారుచేసిన సారాను త్రాగడం ఆచారంగా పాటిస్తారు. ఇప్పపూలను, ఊటబెల్లాన్ని చేర్చి, పులియబెట్టి సారాను వండెదరు.
భారతదేశంలో మధ్య ఉత్తరం నుండి దక్షిణం వరకు వున్న అడవులలో ఇప్ప విస్తారంగా వ్యాపించి ఉంది. భారతదేశంలో జార్ఘండు, బీహరు, ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్, గుజరాత్, ఒడిషా/ఒడిస్సా, ఉత్తరాంధ్రలోని అడవులలో (ఎజెన్సి ప్రాంతం) ఇప్పచెట్లు పెరుగుచున్నవి. ఈ అడవులలోచెట్లు 1. మధుక ఇండిక, మరియు2. మధుక లాంగిఫొలియా జాతులకు చెందినవి. ఈ అడవులలో విస్తరించిన చెట్ల నుండి సమర్ధవంతంగా సేకరించగల్గిన 5 లక్షల టన్నుల విత్తనాన్ని, అందులోంచి 1.8 లక్షల టన్నుల నూనెను ఉత్పత్తిచెయ్యవచ్చును. కాని సేకరణ ఆ స్దాయిలో జరగడం లేదు.
ఇప్పచెట్టు బలంగా, పాదుకు చుట్టుపక్కల విస్తరించిన పటిష్ఠమైన వేర్లు, చేవకలిగిన కాండం, కొమ్మలు కలిగి 16-20 మీటరుల ఎత్తు పెరుగుతుంది, కాండం బెరడు క్రింద మృదువు కాండం, లోపల చేవదీరిన భాగం వుండును. చేవ తీరిన కాండం ఎరుపు రంగుకలిగిన బ్రౌన్ వర్ణంలో వుండును. చేవతీరినకాండం సాంద్రత 929 కీ.జీ.లు/m3. ఇప్పచెట్టు ఆకురాల్చును. ఆకురాల్చని సతత హరిత వృక్షజాతులు ఉన్నాయి. చెట్టుబెరడు నిలువుగా పగుళ్లు వుండి నలుపు-బూడిదరంగులో వుండును. కొమ్మలను విరివిగా కల్గి, కొమ్మల చివరఆకులు (పత్రాలు) గుత్తులుగా ఎర్పడి వుండును. పుష్పాలు కూడా కొమ్మల చివర గుత్తులుగా ఎర్పడును. పత్రాల సైజు 6-9X13-23 సెం.మి. వుండును. సాగిన అండాకారంగా వుండి, దళసరిగా వుండి, త్రుంచినప్పుడు పాలవంటి చిక్కని జిగటగా వున్న ద్రవం స్రవించును. లేత ఆకులు పింకురంగులో వుండి, అడుగుభాగంలో నూగు వంటిది కల్గివుండును. చెట్టు 8-15సంవత్సరంల వరకు బలిష్టంగా మారును.60 సంవత్సరంల వరకు పుష్పించును. ఎండకాలం ముందు ఫిబ్రవరి-ఏప్రిల్ నెలలో ఆకురాల్చును. ఆ సమయంలోనే కస్తూరి వాసన కలిగిన పూలు పుష్పింఛడం మెదల్వౌతుంది. వాడిన పూలదళాలు సాధారణంగా వుదయ సమయంలో రాలును. ఒక చెట్టు నుండి 100-150 కిలోల పూల రెక్కల దిగుబడి వుండును. ఇలా రాలిపడిన పూలను సేకరించి నీడలో ఆరబెట్టెదరు. పలధికరణ తరువాత రెండు నెలకు కాయలు పక్వానికి వచ్చును. జూన్-జులై నాటికి కాయలు పూర్తిగా పండి, విత్తానాలు ఏర్పడును. కాయ (పండు) ఆండాకారంలో చిన్నకాయలా వుండును. పండుపై లోపలి భాంలో గుజ్జు, దాని దిగువన గింజ వుండును. ఒక చెట్టు నుండి ఎడాదికి 60-80 కిలోల విత్తనం పొందవచ్చును. పెద్ద చెట్లు అయిన 100 కీ.జి.ల వరకు విత్తనాన్ని పొందవచ్చును. విత్తనంలో 30-35% వరకునూనె, 14-16% వరకు ప్రోటినులు వుండును. విత్తనంలో రెండు పిక్కలు (kernels) వుండి, విత్తనబరువులో 70% వుండును.పిక్కల సైజు 25X17.5మి.మీ.వుండును.పిక్కలోనూనెశాతం46-50% వుండును. పళ్ళుఫక్వానికి వచ్చిన తరువాత రాలి క్రిందపడును. ఆలా పడిన పళ్ళను అక్కడ నివసించు గిరిజనులు, అడవి జాతులవారు, సమీప గ్రామీణులు సేకరించి, ట్రైబల్ కొఆపరెటివ్ సంస్దలకు లేదా వ్యాపారులకు అమ్మెదరు. విత్తన సేకరణ జూన్ నుండి ఆగస్టు వరకు కొనసాగును. పండి, రాలిక్రిందపండిన పళ్ళను ఆలాగే వదలివేసిన తేమతగినంతగా లభించినచో అవిమొలకెత్తడం మొదలు పెట్టును.ఆందుచే విత్తనాలు రాలిపడటం మొదలైన వెంటనే వాటిని సేకరించడం మొదలు పెట్టవలెను. సేకరించిన పళ్ల నుండి నూనె గింజలను వేంటనే వారములోపుగా వేరుచెయుదురు. కాయలను నుండి వేరుచేసిన గింజలను కళ్ళంలో ఆరబెట్టి తేమ శాతం 6%కు వచ్చిన తరువాత గన్నిబస్తాలలో నిలువ చెయుదురు.గింజలలో7-8% వరకు తేమ వున్నచో గింజలు మొలకెత్తు అవకాశం ఉంది. సరిగా జాగ్రత్తలు తీసుకొని నిల్వవుంచిన ఒక సంవత్సరం వరకు నిల్వ వుంచవచ్చును. గిరిజనులకు ఉపాధి కల్పించు వుద్ధెశ్యంతో ప్రభుత్వ సహకారంతో గిరిజన సహకార సంస్దల ద్వారా ఇప్పగింజలను సేకరించుచున్నారు. వ్యవసాయ మంత్రిత్వశాఖ అధ్వరం లోని 'నేషనల్ ఆయిల్సీడ్స్ అండ్ వెజిటబుల్ ఆయిల్ డెవలప్మెంట్ బోర్డ్' వారు చెట్ల నూనె గింజల ఉత్పత్తి పెంచుటకు, గింజల సేకరణకు పథకాలను అమలు చేస్తున్నారు.
Fruit in Narsapur, Medak district, భారత దేశము
Fruit with leaves in Narsapur, Medak district, భారత దేశము
Trunk in Narsapur, Medak district, భారత దేశము
Tree in Narsapur, Medak district, భారత దేశము
Tree in Hyderabad, India
Tree in Hyderabad, India
Tree in Hyderabad, India